నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. హైదరాబాద్ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలుత అమరవీరుల స్థూపం వద్ద అమిత్షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందని, ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని అమిత్షా అన్నారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో వల్లభ్ భాయ్ పటేల్ నిజాం మెడలు వంచారని తెలిపారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారని కొనియాడారు.









