తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా గన్పార్క్ దగ్గర అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ భారత్లో అంతర్భాగమైన రోజును.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామని అన్నారు.
తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని, ప్రాణాలు తృణప్రాయంగా భావించి.. గుండెలు ఎదురొడ్డి నిలిచారని, ఆనాటి ప్రజా పోరాటాలు, త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి లాంటి ఎందరో యోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు. నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని సర్మించుకుందామన్నారు. తెలంగాణ సాధనతో తన జన్మ సార్ధకమైందని, దేశం ఇప్పటికి కూడా ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఉందని, తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వ్యవసాయానికి ఎంతో లబ్ధి చేకూరిందని, ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఆ పథకాన్ని పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో కరవును తరిమికొట్టామని, ఇప్పుడు పాలమూరు సస్యశ్యామలమవుతోందన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, వరంగల్ జిల్లాకు కూడా అదనంగా సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, త్వరలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే అప్పర్ కృష్ణా, తుంగభద్ర.. భీమా ఎడమ కాలువ ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదన్నారు.









