తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో యువతకు, నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కారు మోసం చేసిందని ..వాళ్లకు నియామకాలు చేపట్టకుండా నమ్మించి వంచించిన కేసీఆర్ సర్కార్పై నిరసన తెలియజేస్తూ తెలగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి 24గంటల పాటు చేపట్టిన ఉపవాసదీక్ష విరమించారు. ఇందిరాపార్క్లో బుధవారం ప్రారంభించిన ఉపవాస దీక్షను గురువారం విరమించారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
యువతకు మాదే భరోసా..
యువత, ఉద్యోగులు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నియామకాల్లేక నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కిషన్రెడ్డి, ప్రకాష్ జవదేకర్ అన్నారు. నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్తుకు బిజెపి భరోసా ఇస్తుందని తెలిపారు.
కేసీఆర్ సర్కారుకు చుక్కలే..
కిషన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందించారు ప్రకాష్ జవదేకర్. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించామని… కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని ప్రకాశ్ జవదేకర్ ఈసందర్భంగా తెలిపారు.