AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెత్తబుట్టలో రూ.56 లక్షల విలువైన బంగారం

ఇటీవల కాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడుతోంది. కస్టమ్స్‌ తనిఖీలు తప్పించు­కుని బంగారాన్ని బయటికి తరలించేందు­కు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. బంగారాన్ని పేస్టుగా, స్పేగా మార్చటంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, లో దుస్తుల్లో గుట్టుగా స్మగ్లింగ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా.. ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌­పోర్టు ఉద్యోగితో కుమ్మక్కై.. అతడు స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కాడు.

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ నుంచి బుధవారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. తన వెంట రహస్యంగా రూ.56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారం బిస్కెట్లను తీసుకొని ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే అతడు కస్టమ్స్‌ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్‌ తనిఖీలకు వచ్చాడు.

తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా.. అతడి తీరు అనుమానస్పదంగా కనిపించటంతో అధికారులు అతడిని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి చెత్తడబ్బాలో వేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10