ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ జోరు పెంచుతోంది. కొత్త నేతల చేరికపై వేగంగా పావులు కదుపుతోంది. ఈ నెల 16న హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నందున చేరికలన్నీ ఒకేసారి చేపట్టి ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయాలని ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. అగ్రనేత సోనియా గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. 17న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్.. సోనియాతో పాటు ప్రముఖ నాయకులందరి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేలా అడుగులు వేస్తోంది.
కొంతకాలంగా కాంగ్రెస్ నూతనోత్సాహంతో పని చేస్తోంది. అనూహ్యంగా పుంజుకుని ప్రధాన పోటీదారుగా అవతరించిన హస్తం పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పంచన చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ బలైమైన నేతలే టచ్ లోకి రావడంతో వారితో సంప్రదింపులు జరిపిన పార్టీ సోనియా సమక్షంలో పార్టీలో చేరేలా స్కెచ్ వేస్తోంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మైనంపల్లి హన్మంతరావు, రేఖా నాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ సీటు దక్కించుకున్న హన్మంతరావు మంత్రి హరీశ్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గులాబీ పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను తప్పించి ఆమె స్థానంలో మరొకరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. దాంతో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన పదవీ కాలం పూర్తయ్యాకే కాంగ్రెస్ లో చేరతానని చెబుతున్న రేఖా నాయక్.. సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.
బీఆర్ఎస్ లో మరో ప్రముక అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా సోనియా సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు తుమ్మల. ఇప్పటికే తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరిపారు. ఇక, నల్లగొండ జిల్లాకు చెందిన వేముల వీరేశం కూడా హస్తం కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.