రాఖీ కట్టెందుకని ఎంతో ప్రేమతో పండుగకు ముందు రోజే తమ్ముని ఇంటికి వచ్చింది అక్క. ఎంతో ప్రేమగా.. తమ్మునికి రాఖీ కట్టి పండుగను జరుపుకోవాలనుకుంది. కానీ.. ఆ అక్కతమ్ముల అనుబంధంపై విధికి కన్ను కుట్టినట్టుంది. పండుగ రోజునే ఆ కుటంబంలో తీరని విషాదం నింపింది. ముందు రోజు వచ్చిన అక్కకు.. రాత్రి పొలానికి వెళ్లిన తమ్ముడు బావిలో శవమై కనిపించటంతో.. గుండెలవిసేలా రోధించిన ఆ అక్క.. తాను ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన రాఖీని చివరిసారిగా తమ్మునికి కట్టి బోరుమంది. మనసులు మెలిపెట్టే ఘటన చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. గుండెలు పిండేసే ఈ ఘటన.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగింది.
ముస్తాబాద్కు చెందిన అనమేని నర్సింలు (38)కు భార్య మంగ, కూతురు, కొడుకు ఉన్నారు. నర్సింలు ఐదెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడు. అయితే.. పండుగకు తమ్ముడికి రాఖీ కట్టేందుకు అక్క రాజవ్వ గంభీరావుపేట మండలం నర్మాల నుంచి బుధవారమే ముస్తాబాద్కు వచ్చింది. తెల్లారి రాఖీ కట్టి పండుగ రోజును తమ్ముడితో ఆనందంగా గడపాలనుకుంది. అయితే.. రాత్రి పొలం వద్దకు వెళ్లిన నర్సింలు గురువారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పొలం దగ్గరికి వెళ్లి చూశారు. అయితే.. బావిలో కరెన్సీ నోట్లు నీటిపై తేలుతుండం చూసి.. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మోటర్ల సాయంతో బావిలోని నీటిని మొత్తం తొలగించగా.. నర్సింలు మృతదేహం బయటపడింది. విగతజీవిగా మారిన నర్సింలును చూసి భార్యాపిల్లు, కుటుంబ సభ్యులు బోరుమన్నారు. రాఖీ కడదామని వచ్చిన అక్క రాజవ్వ.. తమ్మున్ని అలా చూససి గుండెలు బాదుకుంది. తాను ఎంతో ప్రేమగా తెచ్చిన రాఖీ ఎవరికి కట్టాలంటూ బోరున విలపించింది. తాను తెచ్చిన రాఖీని చివరిసారిగా తమ్మునికి కట్టి.. రోధించిన తీరు స్థానికులకు కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.