రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలను ఓడించేందుకు కాంగ్రెస్ ఇచ్చిన నినాదంతో తిరగబడదాం, తరిమికొడదామని కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సంబాని చంద్రశేఖర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు గజమాలతో పొంగులేటిని సత్కరించారు. చిన్నకోరుకొండి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో సంబాని, పొంగులేటి ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో చీకటి ఒప్పంద రాజకీయాలు సాగిస్తున్నాయని వారు తీవ్రంగా విమర్శించారు. లిక్కర్ స్కామ్లో సంబంధం కలిగిన కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయకపోవటం అందుకు నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలో వచ్చే ముందు కేసీఆర్ మోసపూరితమైన హమీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు.
