జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు.. మొదట మహారాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావం చూపించేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టే భారీ సంఖ్యలో నాయకులు.. బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. పలు చిన్నాచితక పార్టీలు సైతం.. బీఆర్ఎస్లో విలీనమవుతుండటం విశేషం. తాజాగా మరోపార్టీ, బీఆర్ఎస్లో విలీనమైంది. మహారాష్ట్రకు చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్.. బీఆర్ఎస్లో కలిసిపోయింది. ఆ పార్టీ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే.. తన అనుచరులు, పార్టీ సభ్యులతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిసిన ఆమె.. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
వనితాబాయితో పాటు పలువురు శివసేన, బీజేపీ నేతలు సైతం.. బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణలోని మహిళా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ఇలాంటి విధానాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని మహారాష్ట్ర నేతలు ఆకాంక్షించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన క్రాంతికారీ శేత్కరీ పార్టీని.. బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సతీశ్ పాల్వే ప్రకటించారు.ఇటీవల కేసీఆర్ను కలిసి తమ మద్దతు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర అణగారిన వర్గాల కోసం పనిచేసే లక్ష్యంతో తన పార్టీని బీఆర్ఎస్లో కలుపుతున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషిచేస్తామని చెప్పారు.