AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గద్దర్ గళం అజరామరం.. ఆయన పాట ఎప్పుడూ సజీవమే..

గద్దర్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం
ప్రజా యుద్దనౌక గద్దర్‌ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఓవైసీ సంతాపం తెలిపారు. ప్రజల కోసం పాటలు పాడి గొంతు ఎత్తి పోరాడిన గద్దరన్నకి లాల్ సలాం అని చిరంజీవి ట్వీట్ చేశారు.

గద్దరన్న ఇక లేరనే వార్త తనను తీవ్ర విషాదాన్ని కలుగజేసిందని, ప్రజా ఉద్యమాల్లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిదని చిరంజీవి కొనియాడారు. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని తెలిపారు. వారి గళం అజరామరం అని అన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అటు గద్దర్ మన మధ్యన లేకున్నా ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్య సజీవంగానే ఉంటుందని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గద్దర్ కుటుంబసభ్యులు, అభిమానులకు ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్‌లో గద్దర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ‘పొడుస్తున్న పోద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని నినదించిన ఉద్యమ గోంతుక, జన గళం, యుద్ద నౌక, ప్రజా కవి గద్దరన్నకు జోహర్లు.. మీ పాటకు మరణం లేదు.. ఓం శాంతి’ అని గోపీచంద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అటు హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సంతాపం తెలిపారు.

ఇక గద్దర్ మృతి పట్ల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కవి, ఉద్యమకారుడు గద్దర్ మరణవార్త విని బాధపడ్డానని, సామాజిక సమస్యల పట్ల ఆయన చూపిన అంకితభావం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం నిజంగా స్పూర్తిదాయకమని ప్రియాంకగాంధీ కొనియాడారు. గద్దర్ శక్తివంతమైన పద్యాలు లక్షలాదిమంది ఆకాంక్షలను ప్రతి ధ్వనించాయని, మన హృదయాలపై చెరగని ముద్ర వేశాయన్నారు. దిగ్గజ కవి, ఉద్యమకారుడు గద్దర్ మరణం గురించి విని చాలా బాధపడ్డానని రాహుల్ గాంధీ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10