హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో హెచ్ఎండీఏ భూముల వేలం జరుగుతోంది. రికార్డు స్థాయి ధర పలికి దుమ్ము దులిపేసింది కోకాపేట్ నియోపోలిస్. ఫేజ్ 2లో భాగంగా మోర్నింగ్ సెషనల్. 6,7, 8, 9 ప్లాట్లకు హెచ్ఎండీ వేలం వేసింది. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఎకరం భూమికి 35 కోట్ల రూపాయలుగా ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. అయితే.. హైదరాబాద్ చరిత్రలో నియోపోలిస్ భూముల ధరలు రికార్డులు సృష్టించాయి. ప్లాట్ నెంబర్ 6లో ఎకరం రూ. 71.25 కోట్లు పలకగా, ప్లాట్ నెంబర్ 7లో ఎకరం రూ. 75.50 కోట్లు పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 8లో ఎకరం రూ. 63.50 కోట్లు, ప్లాట్ నెంబర్ 9లో ఎకరం రూ. 73.50 కోట్లు పలికింది.
ఇక సాయంత్రం సెషన్లో కోకా పేట భూముల ధరలు రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చరిత్రను తిరగరాశాయి. దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమి కోకాపేటదే అని తేలిపోయింది. కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో ఎకరం రూ. వంద కోట్లు దాటి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. సాయంత్రం సెషన్ విషయానికొస్తే.. ప్లాట్ నెంబర్ 10లో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 11లో ఎకరం రూ. 58.25 కోట్ల ధర పలికింది.









