గవర్నర్ తమిళిసై ఆదేశం
ముంపు ప్రాంతాల్లో పర్యటన
ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో గవర్నర్ తమిళిసై బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జవహార్నగర్లో ముంపు ప్రాంతాలను తమిళిసై పరిశీలించారు. ముంపు ప్రాంతాల వాసులను పరామర్శించారు. అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ… ముంపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరంగల్లో వరదలు తీవ్ర స్థాయిలో వచ్చాయని.. జవహార్ నగర్ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని కోరారు. చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందించాలని అన్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేస్తోందని.. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని గవర్నర్ తమిళిసై కొనియాడారు.
