మాయమాటలతో కల్లబొల్లి కబుర్లతో తుపాకీ రాముడి మాటలు చెప్పి రెండు పర్యాయాలు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని మాజీ ఎంపీ, టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు భారీ వర్షాలు, వరదలతో కడగండ్ల పాలవుతుంటే తెలంగాణను దోచుకోని దాచుకున్న కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో దోపిడీకీ యత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. మంగళవారం ఇల్లెందులో వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రె్సలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వనించారు.
సభలో పొంగులేటి మాట్లాడుతూ తిమింగళాలను సైతం మాయం చేసే మాయమాటలు నేర్చిన కేసీఆర్ సోనియమ్మకు సైతం మాయమాటలు చెప్పి మోసగించాడన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్ధానాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కొత్తపాత తేడా లేకుండా కాంగ్రెస్ శ్రేణులు పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ రేణుకాచౌదరి, మాజీమంత్రి సంబాని చంధ్రశేఖర్తోపాటు తామంతా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తామని పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చిన హస్తం గుర్తును గెలిపించడమే లక్ష్యంగా పనిచేయలన్నారు. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ కపట ప్రేమ ఒలకపోశాడని ఎన్నికలు సమీపించడంతో వారిపై ప్రేమ కురిపించాడన్నారు. 27రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు.