గ్రేటర్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూడు రోజులుగా జలమండలి అధికారులు నీటి సామర్ధం పెరుగుతుండటంతో ఎప్పకప్పుడు వరద జలాలను దిగువ మూసీలోకి వదులుతున్నారు. ఆదివారం హిమాయత్సాగర్ ప్రాజెక్టుకు 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా రెండు గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1762.00 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్కు 100 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. గరిష్ట స్దాయి నీటి మట్టం 1790 అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం 1785 అడుగులకు చేరింది.
హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మూసీ నదికి వరద పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద సమీపంలో బారీకేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తుండటంతో ట్యాంకర్ల ద్వారా స్దానిక వాటర్బోర్డు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అదే విధంగా వాంతులు, విరేచనాలు కాకుండా క్లోరిన్ బిల్లలు పంపిణీ చేస్తున్నారు. జంట జలాశయాలకు జలకళ రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలను అస్వాదీస్తున్నారు.