ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. గట్టిగానే దంచి కొడుతోంది. దీంతో.. ఇప్పడిప్పుడే బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జనం మళ్లీ ఇంటి వైపు పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితితో ఇప్పటికే వరద గుప్పిట ఉన్న ఢిల్లీ కోలుకునేందుకు ఇంకాస్త సమయం పట్టేదిగా కనిపిస్తోంది.
ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు.. పైగా యమునా నదీకి ఎగువ నుంచి వచ్చి చేరిన వరదతో దేశ రాజధాని ప్రాంతం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓవైపు వర్షం ఆగిపోయినప్పటికీ.. అప్పటికే పోటెత్తిన వరద యమునా నదిని డేంజర్ జోన్కి నెట్టేసింది. దీంతో నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈలోపు నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై ప్రభావం పడింది. మునుపెన్నడూ చూడని దృశ్యాలకు హస్తిన వేదికైంది.









