భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతాన్ని సాకారం చేసింది ఇస్రో. చంద్రయాన్ 3 రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. మూడు దశలను దాటుకొని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. చంద్రుడిపై వైపు ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాకెట్ ఆగస్టు 23 లేదా 24వ తేదీన జాబిలిపై ల్యాండ్ అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ అద్భుత క్షణాన్ని కోట్లాది మంది భారతీయులు వీక్షించారు. కొందరు నేరుగా శ్రీహరి కోటకు వెళ్తే మరికొందరు టీవీల్లో అద్భుత దృశ్యాన్ని చూశారు. ఇక తమ స్మార్ట్ ఫోన్స్లో చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఆకాశంలోకి దూసుకెళ్తున్న రాకెట్ను స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.