రైతులకు ఉచిత విద్యుత్కి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొద్దిరోజులుగా వార్ నడుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలన్నీ ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతున్నాయి. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి ప్రచారం చేస్తుందంటూ రేవంత్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా.. తాజాగా మరోసారి స్పందించారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది’ అంటూ రేవంత్ శనివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన పోస్ట్కు బైబై కేసీఆర్ అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం రాజకీయాల్లో వ్యక్తమవుతోంది. దీంతో రేవంత్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ను రద్దు చేస్తుందని బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రచారాన్ని కట్టడి చేసేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తామనే అంశాన్ని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది.