జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్కు తరలి వచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 రాకెట్ను ప్రయోగించారు.
మానవ మేథస్సుకు మచ్చుతునకలాంటి చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. శాస్త్రవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ఆనందం అంబరాన్నంటింది. నింగికేగిన చంద్రయాన్ – 3 భారత కీర్తి పతాకను దశదిశలా చాటింది. మూడు దశలు పూర్తిచేసుకొని.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళుతోంది. జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు చంద్రాయన్ -3 నింగిలోకి దూసుకెళుతోన్న దృశ్యాలు యావత్ భారతావనిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశాయి.
రాకెట్ మొదటి దశను దాటి రెండో దశలోకి ప్రవేశించింది. రాకెట్ ప్రయోగాన్ని 3 దశల్లో నిర్వహిస్తుండగా.. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. 40 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం సాగనుంది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. భూకక్ష్యలో 24 రోజులపాటు భ్రమణం చెందుతుంది. ఆగస్టు 23వ తేదీ లేదా 24వ తేదీన జాబిల్లిపైకి ల్యాండర్ చేరుతుంది.
విజయవంతంగా భూకక్ష్యలోకి రాకెట్..
చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. 24 రోజుల పాటు భూకక్ష్యలో భ్రమణం చెంది.. ఆ తరువాత చంద్రునివైపు పయనించనుంది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఈ చంద్రయాన్-3 ల్యాండ్ అవనుంది. కాగా, చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్ అవడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు.