విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాట్లాడితే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందంటూ ట్వీట్
రైతులకు ఉచిత కరెంట్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో రేవంత్కు టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మద్దతిచ్చాడు. విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై రేవంత్రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించిందని, రైతులకు ఉచిత కరెంట్ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ ఇచ్చేది, ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ అని బుధవారం ట్వీట్ చేశారు.
రేవంత్కు సపోర్ట్గా నిలుస్తూ మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్ చేసిన బండ్ల గణేష్.. బుధవారం మధ్యాహ్నం మరో ట్వీట్ చేశాడు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పథకమేనని, దాని పేటెంట్ హక్కు కాంగ్రెస్కే దక్కుతుందని బండ్ల గణేష్ తెలిపాడు. గతంలో కాంగ్రెస్నే రైతుల కోసం ఉచిత కరెంట్ పథకాన్ని ప్రారంభించిందనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తు చేసుకోవాలని సూచించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేస్తుంటే.. అప్పుడు చంద్రబాబు పక్కన కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉందని, తాము రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తామని బండ్ల గణేష్ చెప్పాడు. రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాట్లాడారని స్పష్టం చేశాడు. కాంగ్రెస్పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ బండ్లన్న వరుస ట్వీట్లు చేస్తున్నాడు. రాజకీయాల గురించి తాను మాట్లాడనని ఇటీవల చెప్పుకొచ్చిన ఆయన.. ఇప్పుడు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం హాట్టాపిక్గా మారింది.









