AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

60 మందిని రక్షించిన రాజుకు అస్వస్థత..

ఇటీవల జరిగిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి పలువురు క్షేమంగా బయటపడడానికి కారణమైన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని లక్ష్మీనగర్ నివాసి సిగల్ల రాజు నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని లక్ష్మీనగర్‌లో నివసిస్తున్న సిగిల్ల రాజు మంగళవారం (జులై 11) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో రాజు స్పృహతప్పి పడిపోయాడు. తల్లి పార్వతి పలుమార్లు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూడగా కొడుకు రాజు కిందపడిపోయి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఇరుగుపొరుగు సాయంతో తల్లి పార్వతి సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రికి రాజును తరలించింది.

కాగా రాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాత పట్టణం సమీపంలోని చిన్న మల్లెపురం. పదేళ్లుగా సంగారెడ్డిలోని ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబంతో ఇక్కడే నివసిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఒడిశా పర్లాకిమిడిలోని అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కుటుంబంతో సహా పలాసలో ఫలక్‌నుమా రైలెక్కాడు. భువనగిరి సమీపంలో ఫలక్‌నుమా రైలు అగ్ని ప్రమాదానికి గురికావడంతో రాజు ముందుగానే పసిగట్టి చైన్‌లాగి 60 మంది ప్రయాణికులను సురక్షితంగా రైలు నుంచి దింపాడు.

ఈ క్రమంలో మంటల ద్వారా వచ్చిన పొగను రాజు సుమారు 45 నిమిషాలపాటు పీల్చడంతో స్పృహతప్పి పడిపోయాడు. రైల్వే సిబ్బంది భువనగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం అదేరోజు ఇంటికి పంపారు. ఆ తర్వాత కూడా రాజు తరచుగా అనారోగ్య భారీన పడుతుండటంతో అతని తల్లి పార్వతి కుమారుడికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం సాయం కోరింది.

ANN TOP 10