సికింద్రాబాద్ సింధ్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యాపారి ఇంట్లో రూ. 5 కోట్లు దోచుకెళ్లారు. అపార్ట్మెంట్లో నమ్మకంగా పని చేస్తున్న ఓ నేపాలీ.. దొంగలతో చేతులు కలిపి సొత్తు దోచుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సింధి కాలనీ పీజీ రోడ్డు డిమ్మీ పాన్షాప్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ అంతా రాహుల్ గోయల్, ఆయన ముగ్గురు సోదరుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు ఇనుము వ్యాపారం చేస్తున్నారు.
నేపాల్కు చెందిన కమల్ వారి అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. బోనాల పండుగను పురస్కరించుకుని రాహుల్ కుటుంబం ఈ నెల 9న నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్ కు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చారు. ఇంటి మెయిన్ డోర్ తాళాలు, నేలపై ఉన్న 8 గదుల తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాహుల్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వాచ్ మెన్ కమల్.. వారి ఇంట్లో కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలు ఉన్నట్లు తెలిసింది. బోనాల పండుగకు వెళతారని ముందే తెలుసుకున్న కమల్ ఇతర నగరాల్లోని నేపాలీ దొంగలకు సమాచారం ఇచ్చి మొత్తం ఆరుగురు దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. దొంగలు ఆటోలో వచ్చి చోరీ చేసి ఆటోలో వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత ముందుగా బుక్ చేసుకున్న బస్సులో పారిపోయినట్లు తెలిసింది. ఇప్పటికే రెండు ప్రత్యేక బృందాలు విమానంలో నేపాల్ సరిహద్దుకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నాయి. సొత్తు దోచుకుని పరారైనా నేపాలీలు ఒక్కసారి సరిహద్దులు దాటితే పట్టుకోవడం అసాధ్యం. పట్టుబడితే సొత్తు రికవరీ చేయలేం. నేపాల్ చట్టాలు దానిని అంగీకరించవు. కాబట్టి సరిహద్దు దాటకముందే వారిని పట్టుకునేందుకు నగర పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.









