AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పరిహారం కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

ఆదిలాబాద్‌ : రిజర్వాయర్‌ కోసం భూములు ఇచ్చిన తమకు పరిహారం ఎప్పుడిస్తారంటూ ఆ రైతులు బండెనక బండి కట్టి కలెక్టరేట్‌కు చేరారు. భూములిచ్చి నాలుగేళ్లయినా తమ గోడును పట్టించుకోరా అంటూ ఆఫీసు ముందు బైఠాయించి అధికారులను నిలదీశారు. తమకు అన్యాయం జరిగితే ఇక ఊరుకోబోమంటూ హెచ్చరికలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ కోసం నాలుగేళ్ల కింద రైతులు దాదాపు 1,100 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎకరాకు ప్రభుత్వం రూ.8 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ పరిహారం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో పిప్పల్‌కోటి గ్రామం నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం వరకు రైతులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పాయల శంకర్‌, గండ్రత్‌ సుజాత, మల్లేశ్‌లు మాట్లాడారు.. ప్రభుత్వం నాలుగేళ్ల కింద భూములు తీసుకున్నా ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. పెరిగిన ధరల ప్రకారం ఆ పరిహారం చెల్లించాలన్నారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసిందని.. అవి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ను కలసి రైతులు వినతిపత్రం అందజేశారు.

ANN TOP 10