ఉత్తరాఖండ్ తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో భార్యను విపత్తు నిర్వహణ బృందం రక్షించగా రవిరావు ఆచూకీ ఇంకా లభించలేదు.









