కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అన్నట్లు బీఆర్ఎస్ కచ్చితంగా బీజేపీకి బీ టీమ్ అని పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీల ఐక్య వేదిక సమావేశంలో వీహెచ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీ గర్జనపేరుతో తమ బలం చూపిస్తామని.. తమ డిమాండ్స్ హైకమాండ్ ముందు పెడతామని.. బలాన్ని చూపిస్తే అగ్ర నాయకులు ఒప్పుకుంటారని అన్నారు.
తాము అగ్రకులాల నాయకులకు వ్యతిరేకం కాదని.. కానీ తమ డిమాండ్.. పాత వారికీ బీసీలకు స్థానం కల్పించాలని తెలిపారు. కనీసం నలభై శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలు గతంలో అవమానం భరించారని.. ఇపుడు ఆ పరిస్థితి లేదన్నారు. పేరు మార్చి బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి.. కాళేశ్వరానికి నరేంద్ర మోడీ ఎందుకు హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. దేశంలో ఇప్పుడు రాహుల్ గాంధీ హవా నడుస్తోందని… జనంలో రాహుల్ క్రేజ్ పెరిగిందని తెలిపారు. రాహుల్ అన్నట్లు బీఆర్ఎస్ కచ్చితంగా బీజేపీకి బీ టీమ్ అని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు.









