ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. తమ దేశం దివాలా తీసిందన్నారు. ఇప్పటికే అప్పులు తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అయిందన్నారు. తాము దివాలా తీసిన దేశంలో నివసిస్తున్నామన్నారు. ‘సమస్యకు పరిష్కారం మా దేశంలోనే ఉంది. పాకిస్థాన్ సమస్యకు పరిష్కారం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద లేదు’ అన్నారు. పిఎంఎల్ఎన్ నాయకుడు ఖ్వాజా ఆసిఫ్ శనివారం సియాల్కోట్లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వివరాలు తెలిపారు.
ఒకవేళ ఖరీదైన రెండు గోల్ఫ్ క్లబ్స్ను ప్రభుత్వం అమ్మేస్తే నాలుగింట ఒకవంతు పాకిస్థాన్ అప్పుతీరుతుందని సూచించారు. పాకిస్థాన్లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం సరికొత్త శిఖరాలను తాకింది. ఈ వారం అక్కడ ద్రవ్యోల్బణం 40 శాతం చేరుకుంది. ద్రవ్యోల్బణంను తగ్గించేందుకు పాకిస్థాన్ కొన్ని వారాలుగా ప్రయత్నిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై సరికొత్త పన్నులు విధించింది.