AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ కొత్త బాస్‌గా కిషన్‌ రెడ్డి.. బీజేపీ సంచలన నిర్ణయం

తెలుగురాష్ట్రాల్లో సంస్థాగత మార్పులపై దృష్టిపెట్టిన బీజేపీ రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌ రెడ్డిని నియమించింది. అలాగే ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు ప్లేస్‌లో పురంధేశ్వరి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటెల రాజేందర్‌ను నియమించింది బీజేపీ అధిష్టానం. కాగా ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2020 జులై 27న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సోము పదవీ కాలం కూడా ముగియడంతో పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. కాగా మొదట బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కు ఏపీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం సాగింది. అయితే చివరకు పురంధేశ్వరినే ఖాయం చేసింది బీజేపీ అధిష్టానం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు.

కాగా సుమారు మూడేళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు తీరుపై పలు ఫిర్యాదులున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాన్‌ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా రాష్ట్ర నాయకత్వం సహకరించడం లేదంటూ కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు. అలాగే కన్నాలక్ష్మీనారాయణ వంటి సీనియర్‌ నేతలు పార్టీకి దూరమయ్యారు. ఈక్రమంలోనే పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు.

ANN TOP 10