ఒడిషాలో వరుస రైలు ప్రమాదాల ఘటనలు ఇంకా మరువక ముందే గురువారం చెన్నై సమీపంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు చెన్నైలోని ప్యాషన్ బ్రిడ్జ్ జంక్షన్ దాటుతుండగానే రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు బోగీలోంచి తమ ప్రాణాలు కాపాడుకున్నట్టు సమాచారం అందుతోంది. కప్లర్లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఈ ఘటనపై దక్షిణ రైల్వేకు చెందిన ఉన్నతాధికారులు స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు. కప్లర్లో సమస్య వల్లే పొగ వచ్చిందని.. వెంటనే ఫిర్యాదు అందుకున్న తమ సిబ్బంది హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తు చేసి సాంకేతిక సమస్యను సరిదిద్దారని తెలిపారు. అనంతరం రైలు ప్రయాణికులతో సహా క్షేమంగా అక్కడి నుంచి ముంబైకి బయల్దేరింది అని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని దక్షిణ రైల్వే అధికారులు పేర్కొన్నారు.