తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మొత్తం ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరో 24 గంటల్లో రాష్ట్రం అంతటా ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 6-10కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.
“రాబోయే 24 నుండి 48 గంటల్లో రుతుపవనాలు మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేస్తాయి. ప్రస్తుతం, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వేడి ప్రేరేపిత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి” అని IMD సీనియర్ అధికారి తెలిపారు. సాధారణంగా, ఋతుపవనాలు జూన్ 8-10 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించి.. జూన్ 12-14 నాటికి రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయి. ఈ ఏడాది 12 రోజులు ఆలస్యమైంది.
గురువారం నగరంలోని బాలానగర్, చింతల్, కూకట్పల్లి, మాదాపూర్, బేగంపేట, ఎల్బీనగర్, ఘట్కేసర్, కీసర, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.