ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గద్దర్ ప్రజా పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. “గద్దర్ ప్రజా పార్టీ” పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశానికి ముందు ఏపీ, తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి గద్దర్ నివాళులర్పించారు. దోపిడోళ్ల పార్టీ పోయేందుకు ప్రజా పార్టీతో ముందుకొస్తున్నానని గద్దర్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. తెలంగాణ సాధించి పదేళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి.. వేల మంది అమరుల కారణంగా తెలంగాణ వచ్చింది. దొరల రాజ్యం వద్దని తెలంగాణ ఉద్యమం వచ్చిందని గద్దర్ పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజా పాలన సాగడం లేదని.. కనీసం జీవించే హక్కు కూడా ప్రజలకు లేకుండా పోయిందంటూ గద్దర్ ఆవేదన వ్యక్తంచేశారు. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసం ప్రజా పార్టీని స్థాపిస్తున్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం పాలన సాగాలి.. జీవించే హక్కు సహా ఐదు అంశాలు ఆధారంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజా తెలంగాణ కోసం ప్రజల దగ్గరికి వెళుతున్నాను.. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తాను.. పార్టీ నిర్మాణం చేస్తాను.. పార్టీ జెండా, ఎజెండా ప్రజల జెండా ఎజెండానే.. అంటూ గద్దర్ స్పష్టంచేశారు.రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు కీలకం.. ప్రలోభాల నుండి ఓటుని రక్షించడమే నా లక్ష్యమన్నారు.
భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ఒక విధానం, పద్ధతి ప్రకారం ముందుకు వెళతానని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని గద్దర్ పేర్కొన్నారు. తన పార్టీ ఎవరితో కలిసి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. బంగారు తెలంగాణ పుచ్చిపోయిన తెలంగాణా లా తయారైందని.. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక విధానాలు తప్పులు తడకగా ఉన్నాయన్నారు. తన వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారు.. వాళ్లే నా బలం, నా శక్తి.. అంటూ పేర్కొన్నారు.