ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ… తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని… రాజకీయ నాయకులకు, ప్రజలను చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదిక అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని… భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందని చెప్పారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానని వివరించారు. మన భాష సంస్కృతి వైభవం గురించి నేడు ఎవ్వరికీ తెలియని పరిస్థితి అని… నాడు మదరాసీలు అన్నారు.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామన్నారు.