AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. రూ.100తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం

ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రజలను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లోని సిటీ బస్సుల్లో అందుబాటులో ఉన్న టి-24, టి-6, ఎఫ్-24 టికెట్ల విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగు బస్సుల్లో టి-9 టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 18 నుంచి వీటిని జారీ చేయనుండగా.. ఈ టికెట్‌తో మహిళలు, సీనియర్ సిటిజన్లు మాత్రమే ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ టికెట్ ధరను రూ.100గా నిర్ణయించగా.. 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోనూ ప్రయాణించవచ్చు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు(9 గంటలు) మాత్రమే ఈ టికెట్‌తో 60 కిలోమీటర్ల లోపు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. కండక్టర్ల దగ్గర ఈ టికెట్‌ను పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి 9 టికెట్‌ను కండక్టర్లు జారీ చేయనున్నారు. ఈ టికెట్ వల్ల ప్రయాణికులకు డబ్బులు చాలా ఆదా అవ్వనున్నాయి. ఈ టికెట్‌తో టోల్ ఛార్జీల రూపంలో ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లోనే టి 9 టికెట్ చెల్లుబాటు అవుతుంది. పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే వారి కోసం టి 9 టికెట్‌ను ప్రవేశపెట్టారు.

దాదాపు 15 లక్షల మంది తరచూ పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణం చేస్తోన్నారు. వీరిలో మహిళలు, వృద్దులే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో వారికోసం ప్రత్యేకంగా ఈ టికెట్‌ను తీసుకొచ్చినట్లు ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని బస్సు భవన్‌లో టి 9 టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను సజ్జనార్ విడుదల చేశారు. ప్రజలకు ఆర్ధికభారం తగ్గించేందుకు ఈ టికెట్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10