AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రియుడిని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వింత ప్రవర్తన..

తాము వద్దన్నా ప్రియుడిని కూతురు పెళ్లి చేసుకోవడం, పోలీసులు తమకు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కోపంలో బిడ్డ దుస్తులతో దిష్టిబొమ్మ తయారుచేసి దగ్ధం చేశారు. తమకు కూతురే లేదని, చనిపోయిందని భావిస్తూ ఇలా తమ ప్రతీకారం తీర్చుకున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన సమ్మెట శరత్ చంద్ర, నాంపల్లి ప్రీతి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారడంతో.. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. చివరికి పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకోగా.. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. ఇద్దరి కూలాలు వేరే వేరు కావడంతో కుటుంబసభ్యులు కులాంతర వివాహం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల నుంచి రక్షణ కోరుతూ వర్దన్నపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిని ఏమీ అనవద్దని చెప్పి ఇంటికి పంపించారు.

తాము అంగీకరించకపోయినా ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోవడం, పోలీస్ స్టేషన్‌కి పిలిపించి తమకే కౌన్సెలింగ్‌ ఇప్పించడాన్ని తల్లిదండ్రులు భరించలేకపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఆగ్రహంతో కూతురు దుస్తులతో దిష్టిబొమ్మ తయారు చేశారు. అనంతరం తమకు బిడ్డలేదని, చనిపోయిందని భావిస్తూ దిష్టిబొమ్మ దగ్దం చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. బిడ్డపై కోపంతో పేరెంట్స్ ఇలా వింతగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10