భర్తను చెట్టుకు కట్టేసి నిప్పంటించిన భార్య..
సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లిన భార్య.. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. బిహార్లోని ముజఫర్పుర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాసుదేవ్పుర్ సరాయ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ.. సెల్ఫీ తీసుకుందామంటూ శనివారం రాత్రి భర్తను ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది. అనంతరం చెట్టుకు కట్టేసింది.
అరవకుండా ఉండేందుకు బాధితుడి నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత అతడి ఒంటిపై కిరోసిన్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు చెలరేగడంతో గ్రామస్థులు వచ్చి ఆర్పారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. మహిళకు గ్రామంలో మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.