హైదరాబాద్ సరూర్నగర్ అప్సర (30) మర్డర్ కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసి ఆపై మ్యాన్హోల్లో పడేసి పూడ్చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు.. ఆమె తల్లితో కలిసి అప్సర కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అప్సరను పూజారే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. చైన్నైకి చెందిన అప్సర తల్లితో కలిసి ఏడాది క్రితం నగరానికి వచ్చింది. ఆమె టెంపుల్కు వెళ్లే క్రమంలో అక్కడే పూజారిగా ఉన్న సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణను తనను కూడా పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తడి తేవటంతోనే తాను చంపేసినట్లు పూజారి ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. అప్సరకు చెన్నైలో ఓ బాయ్ఫ్రెండ్ ఉన్నాడని.. అతనితో ఆమె చాలా సన్నిహితంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అతడి వల్లే ఆమె గర్భం దాల్చిందని.. ఆపై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందన్నాడు. లేదంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హత్య చేయాల్సి వచ్చిందన్నాడు.
ఇదిలా ఉండగానే.. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. చైన్నైలో ఉన్నప్పుడే ఆమెకు పెళ్లి జరిగినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే అతడు ఎవరు ? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇలా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.