కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనికి ముందు కొత్తగా నిర్మించిన పార్లమెంటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటును జాతికి అంకితం చేశారు. లోక్సభలోకి ప్రవేశించగానే ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులు స్టాండింగ్ ఒవేషన్ పలికారు. నిలబడి తమ చప్పట్ల మధ్య మోదీకి ఆహ్వానం పలికారు.
దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి గుర్తుగా ప్రత్యేక 75 రూపాయల నాణేన్ని, తపాలా బిళ్లను మోదీ, ఓం బిర్లా, హరివంశ్ విడుదల చేశారు. ఈ నాణానికి ఒకవైపు అశోక స్తంభంలోని సింహ తలాటం, దానికి దిగువన ‘సత్యమేవ జయతే’ అక్షరాలు ఉంటాయి. ఎడమ వైపున దేవనాగరి లిపిలో ‘భారత్’ అని.. కుడివైపున ‘ఇండియా’ అని ఆంగ్లంలో రాసి ఉంటుంది. అలాగే దిగువన నాణెం విలువ అయిన 75 ముద్రించి ఉంటుంది. నాణానికి మరోవైపు పార్లమెంటు భవన సముదాయం ముద్రించి ఉంటుంది. దీనికి పైన.. సంసద్ సంకుల్ అని దేవనాగరి లిపిలో.. దిగువన పార్లమెంటు కాంప్లెక్స్.. అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.