AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో ఇంత అవమానమా?

మాకో రూం కూడా ఇవ్వరా..
శాసనసభలో ఈటల రాజేందర్‌ అసంతృప్తి

హైదరాబాద్‌: ఇది అవమానమేనని, అసెంబ్లీలో బీజేపీకి ఒక గది కూడా కేటాయించకపోవడంపై ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతూ… అసెంబ్లీలో టిఫిన్‌ చేయడానికి కూడా తమకు రూం లేదని అన్నారు. రూం కూడా కేటాయించకపోవడం ఎమ్మెల్యేలను అవమానించడమే అని తెలిపారు. తాము కార్లలో కూర్చుంటున్నామని అన్నారు. ‘‘అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ఆఫీస్‌ కేటాయించాలి. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాం కానీ మాకు ఆఫీస్‌ ఇవ్వడం లేదు. కనీసం యూరినల్స్‌ కు వెళ్లేందుకు కూడా మాకు వెసులుబాటు లేదు. ఇంత అవమానమా?. ఈ విషయంపై స్పీకర్‌ను అర డజను సార్లు కలిశాం. ఏదైనా సమస్యపై కూర్చుని మాట్లాడేందుకు ఒక రూం ఇయ్యరా. బీజేపీ సభ్యులను బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు కూడా పిలుస్తలేరు. గతంలో సీపీఐ, సీపీఎం, ఒక్కొక్క సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి పిలిచారు. ఇది అన్యాయం కాదా?’’ అంటూ ప్రశ్నించారు.

కాగా ఈటల మాటలకు మంత్రి హరీష్‌ రావు మధ్యలో అడ్డుతగిలారు. సీనియర్‌ సభ్యులుగా తమకు నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఐదుగురు సభ్యులు ఉంటేనే ఛాంబర్‌ ఇవ్వాలని నిబందన ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్‌ పరిమితికి లోబడి, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. బడ్జెట్‌పై విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి హరీష్‌ రావు కోరారు.

ANN TOP 10