మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు మృతిచెందారు. చనిపోయిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నదమ్ములు నలుగురూ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్లోని సూరత్కు వెళ్లారు. ఐదురోజుల క్రితం వీరి స్వగ్రామమైన చౌటపల్లిలో బంధువు ఎరుకల రాములు మృతి చెందారు.
దీంతో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఈ నలుగురూ తమ కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి సూరత్కు మంగళవారం కారులో బయల్దేరారు. అదే రోజు రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.