తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.
ఇవాళ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంది. ఇక కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
రేపు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. అలాగే 24వ తేదీ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. 25వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అన్నారు.