జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న వార్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందనే ప్రచారం అబద్ధమని.. అది ఎవ్వరూ నమ్మొద్దని సూచించారు. ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించాలని.. జేపీఎస్ లపై సీఎం కేసీఆర్ కు మంచి అభిప్రాయం ఉందని.. ఆ పేరును చెడ గొట్టుకోవద్దని తెలిపారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం.. నియంత్రించాలని అనుకోవడం తప్పు అని తెలిపారు. JPS లు సమ్మె విరమిస్తే సీఎం వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం ఉందని.. చట్ట విరుద్ధంగా సమ్మె కొనసాగించవద్దని చెప్పారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారని.. ఇప్పుడు ఆ నిబంధనలు ఉల్లంఘించడం బాగోలేదని చెప్పారు. ఇప్పటికైనా మించిపోలేదని.. ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వెంటనే సమ్మె విరమించి.. విధుల్లో చేరాలని సూచించారు.