దేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి షాక్ తగిలింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ.. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని వివరించింది.
