AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌తో అట్టుడుకుతున్నపాకిస్థాన్!

పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టిస్తుండడంతో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ను నియంత్రణలో ఉంచినట్టు ‘డాన్’ పత్రిక తెలిపింది. ఇంటర్నెట్‌ను నిలిపివేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తప్ప మరోటి కాదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై నిషేధాన్ని ఎత్తివేయాలని, సేవలను పునరుద్ధరించాలని కోరుతూ పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్స్, అంతర్గత శాఖ మంత్రిత్వశాఖను కోరినట్టు తెలిపింది.

పీటీఐ పార్టీ చైర్మన్ అయిన ఇమ్రాన్‌ను నిన్న ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది దేశవ్యాప్త అలర్లకు కారణమైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపై ఆందోళనకు దిగారు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, గుజ్రాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్ వీధులు ఇమ్రాన్ మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై రాళ్ల దాడికి దిగిన ఆందోళనకారులు.. రోడ్లపై బ్యానర్లు, టైర్లు తగలబెట్టి బ్లాక్ చేశారు.

మరికొందరు ఆందోళనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. ప్రధాన గేటును విరగొట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాహోర్‌లో కార్ప్స్ కమాండర్‌ ఇంటిని తగలబెట్టారు. అలాగే, కరాచీ, హైదరాబాద్, బలూచిస్థాన్, క్వెట్టాలలోనూ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున గుమికూడారు. ఫైసలాబాద్‌ పట్టణంలోని అంతర్గత శాఖ మంత్రి రానా సనావుల్లా ఇంటిపై కొందరు రాళ్లు రువ్వారు. ఇలాంటి వాటిని సహించబోమని, ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి ట్వీట్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10