తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం హైదరాబాద్లోని సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల సీఎం, మంత్రులకు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో సీఎం దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు. ప్రజా ప్రభుత్వం తలపెట్టిన నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతల కల్పన వంటి అంశాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడటంతో పాటు హైదరాబాద్ను ప్రపంచంలోని టాప్ నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి..
టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ, Gen AI, క్లౌడ్ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఈ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని 600 మెగావాట్ల (MW) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన అంశాన్ని ప్రస్తావించారు.