బాక్సింగ్ డే టెస్టులో భారత (IND vs AUS) బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు. 221కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఫాలోఆన్ గండాన్ని గట్టెక్కించిన ఈ బ్యాటింగ్ ధ్వయం జట్టు స్కోరును 350 దాటించారు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదుచేయగా, సుందర్ నాలుగో హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
అయితే సుందర్ 162 బాల్స్లో 50 రన్స్ చేసి నాథన్ బౌలింగ్లో క్యాబౌట్గా వెనుతిరగడంతో ఈ జోడీ జోరుకు బ్రేక్పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా వెంటనే వెనుతిరగడంతో నితీశ్కు సెంచరీ చేసే అవకాశం వస్తుందా అనే టెన్షన్ అందరిలో నిండిపోయింది. అప్పటికే 97 రన్స్ చేసిన నితీశ్.. రెండు పరుగులు చేసి 99కి చేరాడు. ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్లో (ఇన్నింగ్స్ 114.3 ఓవర్) ఫోర్ కొట్టి టెస్టుల్లో తొలి సెంచరీ నమోదుచేశాడు.
హాఫ్ సెంచరీ సమయంలో తగ్గేదే లే అన్నట్లు పుష్ప స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న నితీశ్.. సెంచరీని బాహుబలి స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. గాల్లోకి పంచ్ విసుతూ.. మోకాలిపై కూర్చుని బ్యాట్ హ్యాండిల్కు హెల్మెట్ పెట్టి భగవంతునికి కృతజ్ఞత తెలిపాడు. ఈ సమయంలో ప్రేక్షకులతోకలిసి మ్యాచ్ చూస్తున్న నితీశ్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. కుమారుడి తొలి సెంచరీని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సంతోషంతో కన్నీరుపెట్టారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కాగా, నితీశ్ తన తొలి సెంచరీ తర్వాత మరో రెండు పరుగులు జోడించిన తర్వాత.. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దీంతో గ్రౌండ్ స్టాఫ్ పిచ్ను కవర్స్తో కప్పేయడంతో మూడో ఆట ముగిసింది. మూడో రోజు మూడు వికెట్లే కోల్పోయిన టీమ్ఇండియా 191 రన్స్ చేసింది. మొత్తంగా 9 వికెట్లు కోల్పోయి 355 రన్స్ చేసింది. ప్రస్తుతం నితీశ్ (104), సిరాజ్ (2) రన్స్తో నాటౌట్గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ మరో 116 రన్స్ వెనుకపడి ఉన్నది. పంత్ (28), జడేజా (17) రన్స్ చేశారు. టీమ్ఇండియా తరఫున నితీశ్ 104 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ 3 వికెట్ల చొప్పున తీయగా, నాథన్ 2 వికెట్లు పడగొట్టాడు.
పుష్ప సినిమా స్టైల్లో..
ఆస్ట్రేలియాపై నితీష్ కుమార్ రెడ్డి తన టెస్టు కెరీర్లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేసి, తాజాగా సెంచరీ కూడా పూర్తి చేశాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న తన టెస్ట్ కెరీర్లో మూడో మ్యాచ్లో ఆరో ఇన్నింగ్స్లో ఆయన ఈ అర్ధ సెంచరీని సాధించాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ 82.3 ఓవర్లలో అర్ధసెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతిని నితీష్ కుమార్ రెడ్డి ఎదుర్కొన్నాడు. మిచెల్ వైడ్ డెలివరీలో నితీష్ బంతిని ఆఫ్ సైడ్లోకి ముందుకు పంపించాడు. ఆ క్రమంలో నితీష్ మొదటి టెస్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ అద్భుతమైన షాట్ తర్వాత నితీష్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా స్టైల్లో తన క్రికెట్ బ్యాట్ను తగ్గేదేలే అంటూ ఒక స్టిల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.