బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో చేరికలు అయ్యాయి. నిన్ననే ఒడిశాలో కూడా ఆ రాష్ట్ర ప్రముఖ నేతలు కూడా బీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత నేషనల్ రాజకీయాల్లో బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ ఎస్ బీఆర్ ఎస్ గా మారినప్పటి నుంచి కవితనే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. అన్ని మీటింగుల్లో కవిత కచ్చితంగా ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా ఇప్పుడు సినీ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ శనివారం నాడు కవితను కలిశారు.
కవిత రెసిడెన్సీలో వీరిద్దరూ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీలో ప్రస్తుత దేశ రాజకీయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కవితతో శరత్ కుమార్ భేటీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది. తమిళ నాడులో కూడా తమ పార్టీని విస్తరింప జేయాలని బీఆర్ ఎస్ భావిస్తున్న తరుణంలో శరత్ కుమార్ భేటీ తమిళ రాజకీయాల్లో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ ఎస్లో చేరికలు, విస్తరణకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా కవితనే దగ్గరుండి చూసుకుంటోంది.