తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం నంబాల గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించిన చిన్నారి హత్యాచార కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలికకు వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు డీసీపీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు.
గత నెల 24వ తేదీన బాలిక మృతదేహం బావిలో లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలికకు పెద్దనాన్న అయిన శనిగారపు బాపు (52), మరో వ్యక్తి ఉప్పారపు సతీశ్ (40) ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు తామే నేరం చేసినట్లు అంగీకరించారు.
ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి కుర్కురే ప్యాకెట్ కొనిస్తామని ఆశ చూపించి, సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లినట్లు నిందితులు తెలిపారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసినట్లు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.








