గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్కు ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలీసు సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ ప్రకాశ్ ధర్నా చేశారు. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన అప్పటి ఉన్నతాధికారులు ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రస్తుతం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందుకున్న ప్రకాశ్ వెంటనే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ను కలిసి తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రకాశ్కు న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








