అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తున్న ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. భద్రతా చర్యలు పాటించని అన్ని ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్కు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అదనపు రవాణా కమిషనర్ నేతృత్వంలో బెంగళూరు నగరం, గ్రామీణ ప్రాంతాల్లో సైతం బస్సులను తనిఖీ చేయడానికి మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ బృందాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్, అగ్నిమాపక యంత్రం, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి వంటి ప్రయాణీకుల భద్రతా లక్షణాలను, అలాగే వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న వస్తువులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించాయి. రవాణా శాఖ అధికారులు అక్టోబర్ 24 నుండి నవంబర్ 5 వరకు 13 రోజులుగా బెంగళూరుతో సహా 13 RTOల పరిధిలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 4,452 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి నివేదిక సమర్పించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 604 బస్సులపై కేసులు నమోదు చేయగా, 102 బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సుల నుండి పన్ను, జరిమానా రూపంలో ఏకంగా రూ.1,09,91,284 వసూలు చేశారు. కర్నూలు ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, భద్రతా చర్యలు పాటించని బస్సు యజమానులను తగిన విధంగా శిక్షించారు. ఈ చర్యలతోనైనా ప్రైవేట్ బస్సు యజమానులు మేల్కొని భద్రతా ప్రమాణాలను పాటిస్తారో లేదో చూడాలి.









