ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. శనివారం బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఐదవ, తుది మ్యాచ్ ఈ సిరీస్కు అత్యంత కీలకం కానుంది. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంలో భాగంగా ఈ ఆఖరి మ్యాచ్లోనూ టీమిండియా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ పోరులో బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కోసం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు శివమ్ దూబేకు విశ్రాంతి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ను టీమిండియా ప్రయోగాలకు ఉపయోగించుకుంది. తొలి రెండు టీ20ల్లో హర్షిత్ రాణా, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్లను ఆడించినప్పటికీ, వారు అంచనాలను అందుకోలేకపోయారు. దాంతో మూడో టీ20లో ఈ ముగ్గురిపై వేటు వేసిన గంభీర్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశాలు కల్పించారు. నాలుగో టీ20లో జితేశ్, సుందర్ విఫలమైనా.. ఆఖరి మ్యాచ్లో వీరిని కొనసాగించనున్నట్లు సమాచారం.
ఈ కీలక మ్యాచ్లో బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా సూర్య వైఫల్యం విమర్శలకు దారి తీస్తోంది. బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్లు పంచుకోనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా అండగా నిలవనున్నాడు. ఆసీస్ కూడా సిరీస్ సమం చేయడంపై కన్నేసింది.









