రక్షణ దళాల్లో పని చేస్తున్న సైనికులకు తీసి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రామ పంచాయితీల్లో నివసించేవారికి వర్తిస్తుందని వెల్లడించింది.
పంచాయితీల్లో రక్షణ సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మాజీ సైనికులు, విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ సదుపాయం ఉండేది.
తాజా నిర్ణయం నేపథ్యంలో మాజీ సైనికులతోపాటు విధుల్లో ఉన్న రక్షణ (ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్సు)సిబ్బందితోపాటు , వారి జీవిత భాగస్వాముల పేర్లతో ఉన్న ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు వర్తించనుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ అయ్యాయి. మాజీ సైనికులు, ఆర్మీ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపును పరిమితం చేయడంపై అనేక సమస్యలు ఎదురయ్యాయి.
ఎదురవుతున్న ఇబ్బందులపై రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి నాలుగేళ్ల కిందట ఒక లేఖ రాసింది. దాన్ని పరిశీలించిన కూటమి సర్కార్, రెండు దశాబ్దాల కిందట జారీచేసిన ఉత్తర్వులకు సవరణ చేసింది. ఆర్మీ స్థానంలో డిఫెన్స్(ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్సు) పదాన్ని చేర్చింది.
మాజీ సైనికులు, డ్యూటీలో రక్షణ సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఒకరికే ఆస్తి పన్ను మినహాయింపు వస్తుంది. భర్త, భార్య పేర్లతో రెండు ఇళ్లున్నా ఒక దానికే వర్తించనుంది. ఒక ఇంటిల ఎన్ని అంతస్తుల్లో ఉన్నా ఒకే డోర్ నెంబరు ఉంటే పన్ను రాయితీ లభించనుంది. అందులో రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు ఉండాలని నిబంధన ఉంది. ముఖ్యంగా వాటిని అద్దెకు ఇవ్వరాదు.
పంచాయతీలోని మొత్తం ఇళ్లలో 10 శాతానికి పైగా రక్షణ సిబ్బందికి చెందినవారు ఉంటే అలాంటిచోట్ల ఆస్తిపన్నులో 50 శాతమే మినహాయింపు ఇవ్వనున్నారు. 10 శాతం కంటే తక్కువ ఇళ్లున్న పంచాయతీల్లో 100 శాతం పన్ను మినహాయింపు వర్తించనుంది. ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం దేశాన్ని రక్షిస్తున్న సిబ్బంది కోసం గౌరవంగా నిలుస్తుందన్నారు పవన్. నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ మాఫీని అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.