ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో లీగ్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
జమ్మూ, పఠాన్కోట్లలో వైమానిక దాడుల హెచ్చరికల నేపథ్యంలో పీబీకేఎస్, డీసీ మధ్య గురువారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ మధ్యలో రద్దు చేశారు. దీని వలన మొత్తం లీగ్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా లీగ్ ఛైర్మన్ అనిల్ ధుమాల్ స్పందించారు.
“పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం” అని పీటీఐతో అరుణ్ ధుమాల్ అన్నారు.
మరోవైపు లీగ్ రద్దు వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చారు. “ఇదంతా తప్పుడు వార్త. ఇప్పటికైతే ధర్మశాల మ్యాచ్ ఒకటే రద్దయ్యింది. దేశంలో మాకు వేర్వేరు వేదికలు ఉన్నాయి. బీసీసీఐ ఎమర్జెన్సీ భేటీ ఏమి లేదు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దు” అని మీడియా ప్రకటనలో కోరారు.