AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్..! సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ..

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు. ఈ మేరకు రాసిన లేఖను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

 

మద్యం కుంభకోణంలో అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాలతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని చెప్పడానికి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని నాని తన లేఖలో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీ లక్ష్మీతో కలిసి ‘ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్‌పీ’ అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని నాని తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, ప్లాట్ నెం.9, సర్వే నెం.403 చిరునామాతో ఈ సంస్థ నమోదైందని ఆయన వివరించారు.

 

ఇదే సమయంలో కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ‘ఇషాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోందని నాని ఆరోపించారు. ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక ఈ-మెయిల్ ఐడీని వినియోగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇది రెండు సంస్థల మధ్య ఉద్దేశపూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు.

 

ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్టయిన నేపథ్యంలో, సిట్టింగ్ ఎంపీకి వారితో ప్రత్యక్ష సంబంధాలుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నాని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న నిధులను పెద్ద మొత్తంలో కేశినేని చిన్ని అక్రమంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీలలో పెట్టుబడులుగా మళ్లించారని తనకు సమాచారం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో లెక్కల్లో చూపని సంపదను దాచిపెట్టడానికి, మనీ లాండరింగ్‌కు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

 

ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని, ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగే ఇలాంటి అక్రమాలను, నిందితులతో సంబంధాలను విచారించకుండా వదిలివేయకూడదని ఆయన కోరారు. రాజకీయ పలుకుబడి చట్టానికి, జవాబుదారీతనానికి అడ్డుకాకుండా చూడాలని, నిర్ణయాత్మక చర్యలు తీసుకుని న్యాయాన్ని నిలబెట్టాలని సీఎంకు రాసిన లేఖలో నాని విజ్ఞప్తి చేశారు.

 

గతంలో విశాఖ భూ కేటాయింపుల విషయంలోనూ కేశినేని నాని తన సోదరుడు చిన్నిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఈ సోదరుల మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10